Chenchulu of Nallamala

 నీడ కోల్పోతున్న నల్లమల చెంచులు

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:13 AM

ప్రపంచం మొత్తంమీద మన దేశంలో అడవి తెగల జనాభా అధికం. అందుకే భారతదేశం అడవిబిడ్డల మానవశాస్త్ర పరిశోధనశాల. 2011 జనాభా లెక్కల ప్రకారం...

నీడ కోల్పోతున్న నల్లమల చెంచులు

ప్రపంచం మొత్తంమీద మన దేశంలో అడవి తెగల జనాభా అధికం. అందుకే భారతదేశం అడవిబిడ్డల మానవశాస్త్ర పరిశోధనశాల. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డు తెగలు 35. ఇందులో చెంచులు అతి వెనుకబడ్డ గుంపులో ఉన్నారు. ప్రత్యేకంగా నల్లమల అడవుల్లో చెంచుల జనాభా 64,227. వీరు షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ తెగల జనాభా 59,18,000 కాగా చెంచులు 5.6 శాతం ఉన్నారు.

అడవి లోపలి భాగాన కొండ వరసలలో చెంచు గుడిసెలు గుంపులుగా పెంట లేక గ్రామంగా ఉంటాయి. వీరి ముఖ్యమైన వృత్తి వేట. వేటాడిన జంతుజాలంతో పాటు అడవి చెట్ల నుండి లభించే వివిధ తినుబండారాలు వారి ఆహారం. కొంతమంది నల్లమల అడవులలో వ్యవసాయాన్ని కూడా వృత్తిగా అనుసరిస్తున్నారు. వీరికి విద్య, అవగాహన లేవు. వీరిని ఆదిమ గిరిజన సమూహాలు అంటారు. ఇంత వెనుకబడ్డ జీవనాన్ని సాగిస్తున్న చెంచుల పట్ల ప్రస్తుత భారత ప్రభుత్వం ‘అడవుల వైవిధ్యాల పరిరక్షణ–1980’ చట్టాన్ని అమలు చేసింది. దీనితో చెంచులకు అందవలసిన రక్షణ నిర్లక్ష్యానికి గురయింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

‘అడవుల వైవిధ్య పరిరక్షణ’ అన్న ఆచరణ భారతదేశానికి కొత్త కాదు. కౌటిల్యుని రాజకీయ వ్యూహాల్లోను, అశోక చక్రవర్తి కాలంలోను ఈ ఆచరణలు ఉన్నాయి. బ్రిటిష్‌వారు తమ పాలనలో అడవులలో నివసిస్తున్న అడవి బిడ్డలతో పాటు వారి పరిరక్షణలో ఉన్న విలువైన అటవీ సహజ వనరులపై ఆధిపత్యాన్ని పొందడానికి చిరుతపులులను పెంచి పోషించారు. ఈ ఆచరణతో పాటు అడవుల పరిరక్షణను బలపరిచిన సంఘటనలకు సాంస్కృతిక సందేశాలు తోడయ్యాయి. అవి– 1969లో మన దేశంలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ సంస్థ 10వ జనరల్‌ అసెంబ్లీ ప్రకటించిన సందేశం ‘‘ఆసియా అంతటా పులుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంది’’ అని. ఈ ప్రకటన మద్దతుతోనే 1973 నాటికి పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని భారతదేశంలో మతపర ఆచార సాంస్కృతిక పరంగా పులికి ఉన్న విశిష్ట స్థానాన్ని ఆధారంగా తీసుకుని పరిరక్షణ నిర్ణయాన్ని బలపరిచింది.

1963 నుంచి 1/70 చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం గిరిజనుల భూమి గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషిద్ధం. 1980 నాటికి భారత ప్రభుత్వం ‘అడవి వైవిధ్య పరిరక్షణ’తో పాటు చెంచుల అభివృద్ధిని ప్రకటించి, అమలుపరిచింది. దీనివల్ల చెంచులు స్థానభ్రంశం చెంది పట్టణ అంచుల్లోకి నెట్టబడ్డారు. చెంచులు పోరాడి సాధించుకున్న 1/70 చట్టం నిరర్థకమైంది. దీనికి కొనసాగింపుగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం 1996లో వచ్చింది. ఈ చట్టాన్ని చెంచులు తిరిగి పోరాడి సంపాదించుకున్నారు. ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు– 1) గ్రామసభల ద్వారా స్వయంపాలనను ప్రోత్సహించడం. 2) సహజవనరుల నిర్వహణకు గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను ఇవ్వడం. 3) గిరిజన సంఘాల హక్కులను చట్టబద్ధంగా గుర్తించడం. 4) గిరిజన జీవనోపాధులు, వర్గాల మొత్తం ఉన్నతికి దోహదపడడం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పెసా చట్టం వర్తిస్తుంది. కాని, ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా దేశంలో అతిపెద్ద రిజర్వాయర్లు, అభయారణ్యాలు ప్రభుత్వం ఏర్పరచింది. పర్యవసానంగా చెంచులు భూమిపై, అడవిపై, ఉపాధి హక్కులన్నీ పోగొట్టుకున్నారు. పోషకాహార లోపాలు, రక్తహీనతలు, టీబీ, మలేరియా వంటి రుగ్మతలకు లోనయి, ఆ జాతి క్షీణించసాగింది. అత్యంత భయాందోళనలకు లోనుచేసే విషయం యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం. చెంచులు నివసించే నల్లమల అభయారణ్యంలోనే 83 చ.కి.మీ. విస్తీర్ణంలో యురేనియం సర్వే, తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, వాతావరణ మంత్రిత్వ శాఖ, అణుశక్తి శాఖ ఆమోదం తెలిపాయి. యురేనియం విద్యుత్‌ ఉత్పత్తికి, వైద్య అనువర్తనాల కోసం రేడియో ఐసోటోపుల తయారీ, అణుశాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడుతుంది. అయితే యురేనియం తవ్వకాల పర్యవసానాలు దుర్భరంగా ఉంటాయి.

జాతీయ నీటివనరుల సంరక్షణ సమన్వయకర్త బి. సత్యనారాయణ వైజాగ్‌ జర్నలిస్టు ఫోరంలో మాట్లాడుతూ ‘కృష్ణనది పరివాహక ప్రదేశానికి 0.5 కి.మీ. దూరంలో ఉన్న నల్లమల అడవిలో యురేనియం తవ్వకాల వల్ల, ఆ ప్రభావం నదీ జలాలపై ఉంటుంది. ఇవి కాలుష్యానికి గురవుతాయి. ఇది విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంది. దీంతో కాలుష్యరహిత వాతావరణంలో జీవించే చెంచులు, చెట్లు, జీవజాలం విపత్తుల పాలవుతాయి. యురేనియం తవ్వకాలకు అనుమతుల వల్ల కాలుష్య నియంత్రణ యాక్టు 1986, అడవుల పరిరక్షణ యాక్టు 1980, వనజీవన రక్షణ యాక్టు 1972, అణుశక్తి నియంత్రణ యాక్టు 2011లను ఉల్లంఘిస్తూ రాజ్యాంగం ప్రజలకిచ్చిన జీవించే హక్కు, జీవనోపాధి హక్కులను ప్రభుత్వం కాలరాసింది. వికిరణ (అణుశక్తి ప్రతిచర్య నుంచి వచ్చే శక్తి రూపం) నుంచి ప్రజలను కాపాడడాన్ని ఆలోచించకుండా ఏ లక్ష్యసాధనకై ఇన్ని చట్టాలను ఉల్లంఘించారు? ఇందుకు కార్పొరేట్‌ శక్తులు బాధ్యత వహిస్తాయా? 1984లో భోపాల్‌ జరిగిన దుర్ఘటన వంటివి యురేనియం తవ్వకాలతో పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం వహించాలి. లేనిపక్షంలో ప్రజలు ఈ బాధ్యతను చేపట్టాలి’ అని అన్నారు.

ఈ చర్చ వల్ల, చెంచుల ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానించింది. దీనికి కొనసాగింపుగా రాజకీయ పార్టీలు, పర్యావరణ కార్యకర్తలు, ప్రజా సంస్థలు కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. ఇంత పెద్దయెత్తున వ్యతిరేకత రావడం వల్ల ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపివేసింది. అయితే గత ఏడాది పార్లమెంటు ఎన్నికల తర్వాత తిరిగి కొనసాగిస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. అడవుల్లోకి అధికారులు రావడం, ఆకాశంలో ఛాపర్లు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విద్య, అవగాహనకు ఆమడదూరంలో ఉన్న చెంచు వర్గాల ఓట్లతో రాజకీయ లబ్ధిపొందదలచిన ప్రభుత్వం ప్రపంచ దేశాలలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకున్నట్లు ఎండమావులను చూపిస్తున్నది. ఇక చెంచుల అభివృద్ధి మాటేమిటి? చెంచులు వంటి వెనుకబడిన ఆదివాసీలకు సంక్షేమం సమకూరితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి దిశను మార్చాలి. ఆదివాసీలను స్నేహితులుగా చూడాలి. చెంచులను రక్షించడమంటే సహజ వనరులను కాపాడడం. ఈ సంపదలో అగ్రభాగం రాబోయే తరాలదే.

డా. వనమాల

పాలమూరు అధ్యయన వేదిక

Comments

Popular posts from this blog

Gujarati financial influence on the Indian economy

Row over CPI(M) not calling Modi govt ‘fascist’; Vijayan eyeing ‘BJP vote’: Cong